కేంద్రం వైఖరికి నిరసన: రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన టీఆర్ఎస్ ఎంపీలు
న్యూఢిల్లీ: రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ధాన్యం కొనుగోలుపై రాజస్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని టీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే వరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని రాజ్యసభలో టీఆర్ఎస్ పక్షనేత కే కేశవరావు తేల్చి చెప్పారు.
ఈ సందర్బంగా లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణలో ధాన్యం సేకరణ కోసం గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేయాలని డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇటు లోక్సభ, అటు రాజ్యసభలో ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు విధానం ప్రవేశపెట్టాలని, తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నార. ఈ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదని, మోడీ ప్రభుత్వం పేదల, రైతు, కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కాగా, లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇచ్చామని, రైతు బంధు ఎకరానికి 10వేలు ఇవ్వడం.. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందాయన్నారు. దీంతో ఎక్కువ శాతం పంట దిగుబడి పెరిగిందని నామా తెలిపారు. వరి ఉత్పత్తిలో ఇండియాలో నెంబర్ వన్ అయ్యామన్నారు. దాని వల్ల వరి సేకరణ సమస్య ఏర్పడిందన్నారు. తెలంగాణలో ఏడాదికి రెండుసార్లు పంట వేస్తారన్నారు.
ధాన్యం సేకరణ కోసం కేంద్రంతో మాట్లాడామని, ఒకసారి తీసుకుంటాం, మరోసారి తీసుకోమని కేంద్రం అంటోందని నామా ఆరోపించారు. ఎఫ్సీఐకి కోటా ఇవ్వడంలేదన్నారు. తెలంగాణ రైతులు రోడ్డుమీదపడ్డారని, ధాన్యం సేకరణ గురించి ఆరు సార్లు మీటింగ్ జరిగిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు పలుసార్లు కేంద్రంతో చర్చలు జరిపారన్నారు. ఏడాదికి ఎంత వరిని ప్రొక్యూర్ చేస్తారని నామా ప్రశ్నించారు. కోటా కేటాయిస్తే, ఆ విషయాన్ని రైతులకు చెబుతామన్నారు. ఏడాదికి ఎంత కోటా తీసుకుంటారో చెప్పాలని కేంద్రాన్ని కోరారు. దక్షిణ భారత దేశంలో వేడి వాతావరణం వల్ల వరి ముక్కలు అవుతుందని, దాని వల్ల బాయిల్డ్ రైస్ను ఫ్రిపర్ చేయాల్సి వస్తుందని ఎంపీ నామా వివరించారు. కనీస మద్దతు ధరకు లీగల్ రైట్ తీసుకురావాలని కోరారు.
మరోవైపు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంపై క్లారిటి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో వరుసగా ఆందోళనలు చేస్తున్న క్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం(ఎంవోయూ) ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో స్పష్టం చేయాలంటూ టీఆర్ఎస్ సభ్యుడు కే కేశవరావు(కేకే) రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్తోనూ మాట్లాడానని, వానాకాలం పంట పూర్తిగా కొంటామని స్పష్టం చేశారు. దేశంలో ప్రతి ఏటా ధాన్యం సేకరణను పెంచుతున్నామని, తెలంగాణ నుంచి కూడా బాగా పెంచామని కేంద్రమంత్రి వివరించారు.
2018-19లో తెలంగాణ నుంచి 51.9 లక్షల టన్నులు, 2019-20లో 74.5 లక్షల టన్నులు, 2020-21లో 94.5 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 50 లక్షల టన్నులు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. 32.66 టన్నులే ఇచ్చిందని తెలిపారు. ఎంవోయూకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణ అంచనాలకు, వాస్తవాలకు చాలా తేడా ఉంటోందని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
ధాన్యం సేకరణ విషయంలో కర్ణాటక నమూనా చాలా బాగుందని కేంద్రమంత్రి పీయూష్ గోల్ చెప్పారు. దాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి 24 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు ఒప్పందం జరిగిందని.. దాన్ని 44 లక్షల టన్నులకు పెంచామని కేంద్రమంత్రి వివరించారు. ఇప్పటి వరకు 27 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ వచ్చిందని, ఇంకా 17 లక్షల టన్నులు పెండింగ్ ఉందని చెప్పారు. పెండింగ్ ధాన్యం పంపకుండా భవిష్యత్ గురించి టీఆర్ఎస్ ప్రశ్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ కొనబోమని ముందుగానే చెప్పామని, ఈ విషయాన్ని ఎంవోయూలో స్పష్టంగా పేర్కొన్నామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయినా భవిష్యత్ గురించి ప్రశ్నిస్తూ.. టీఆర్ఎస్ గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు.
ఇకపై బాయిల్డ్ రైస్ పంపబోమని అక్టోబర్ 4న తెలంగాణ రేఖ రాసిందని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం బాయిల్డ్ రైస్ కొనాలని పదే పదే గొడవ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం విషయాన్ని ఎందుకు రాజకీయం చేేస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భౌతిక తనిఖీల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణకు వెళ్లారని, ఆ రాష్ట్రం లెక్కలను సరిగా నిర్వహించడం లేదన్నారు. ధాన్యం సేకరణ కేంద్రానికి కొత్త కాదని, ఏళ్ల తరబడి ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రక్రియేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంతవరకూ తెలంగాణకు సహకరిస్తోందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.