ఉద్యోగుల హాజరుపై ప్రభుత్వం సీరియస్ - 11 గంటలకు ఉద్యోగానికి వస్తారా : లెక్కలు తేల్చండి..!!
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల హాజరు పైన కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలోనూ..ఆ తరువాత ఉద్యోగుల హాజరు పైన చర్చ మొదలైంది. కొందరు ఉద్యోగులు 11 గంటలకు విధులకు హాజరవుతున్నారనే అంశం పైన ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో.. దీంతో..ఏపీ సచివాలయంలో ఉద్యోగులందరి బయోమెట్రిక్ హజరును తప్పని సరిచేస్తూ సాధారణ పరిపాలన శాఖ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సర్క్యులర్ జారీ చేసింది. బయోమెట్రిక్ హాజరు తప్పని సరి చేయాలని పేర్కొంది.

కార్యదర్శులకు తాజా సూచనలు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాలు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల హాజరు వివరాలను నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులకు సూచనలు జారీ అయ్యాయి. బయోమెట్రిక్ ద్వారా నమోదైన ఉద్యోగుల హాజరును ఎప్పటికప్పుడు గమనించాలని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఏపీ సచివాలయంలోని ఉద్యోగుల హాజరు నమోదు వివరాలు రోజువారీగా సంబంధిత శాఖ కార్యదర్శి పరిశీలించాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ సూచించింది.

11 గంటలకు విధులకు వస్తారా
ఏపీ సచివాలయంలో 10 శాతం మంది ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు గుర్తించినట్టు స్పష్టం చేసిన ప్రభుత్వం ..దీని పైన ఆరా తీస్తోంది. సచివాలయంలోని అన్ని విభాగాల్లోనూ 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆయా శాఖల కార్యదర్శులకు ఆదేశించింది. ఈ అంశంపై గతంలో జారీ చేసిన నిబంధనల్ని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో 11 దాటినా సంబంధిత అధికారులు, ఉద్యోగులు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు కొత్తేమీ కాదు.. మండల, జిల్లా స్థాయిలోనే కాదు.. ఏకంగా సచివాలయంలోనూ ఇలాంటే పరిస్థితి ఉండడంతో.. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

సమయ పాలన..అటెండెన్స్ తప్పని సరి
ఉద్యోగ విరమణ చేసిన, బదిలీ అయిన ఉద్యోగులకు సంబంధించిన వివరాలను బయోమెట్రిక్ పరికరాల నుంచి తొలగించాలని సూచించింది. బయోమెట్రిక్ హాజరు నమోదుకు నెలవారీగా నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని.. ప్రతీశాఖ కార్యదర్శి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలని పేర్కొంది. దీంతో...ప్రభుత్వ తాజా ఆదేశాల పైన ఉద్యోగ సంఘాల నేతలు..ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.