షాకింగ్ : భారత్ లో ధర్డ్ వేవ్ మొదలు-అక్టోబర్ కల్లా పీక్- పిల్లలే టార్గెట్-పీవోఎంకు హోంశాఖ రిపోర్ట్
భారత్ లో కోవిడ్ మహమ్మారి రెండు దఫాలుగా ప్రజల్ని కుదిపేసిన నేపథ్యంలో ధర్డ్ వేవ్ ప్రభావంపై ఈ ఏడాది సెకండ్ వేవ్ సమయం నుంచే భయాలు మొదలయ్యాయి. అవి కాస్తా ఇప్పుడు నిజం కాబోతున్నాయి. కేంద్ర హోంశాఖ తాజాగా ప్రధాని కార్యాలయానికి ఇచ్చిన కీలక నివేదికలో దేశవ్యాప్తంగా ధర్డ్ వేవ్ ప్రభావం మొదలైందంటూ చేసిన హెచ్చరిక ఇప్పుడు దేశ ప్రజలకు షాక్ కు గురిచేసింది. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న తమపై ఇదో పిడుగుగా వారు భావిస్తున్నారు. అన్నింటికంటే మించి అంతా ఊహించినట్లుగానే ఇది పిల్లల్ని టార్గెట్ చేయబోతోందని ఈ నివేదిక హెచ్చరించింది.

భారత్ పై కోవిడ్ ప్రభావం
గతేడాది మార్చి నెలలో తొలిసారిగా భారత్ పై కోవిడ్ మహమ్మారి ప్రభావం చూపడం మొదలైంది. గతేడాది మార్చిలో ప్రారంభమైన కోవిడ్ 19 ఫస్డ్ వేవ్ ప్రభావం అప్పట్లో సెప్టెంబర్ కల్లా పతాకస్ధాయికి చేరి ఆ తర్వాత తగ్గడం మొదలైంది. దీన్నుంచి కోలుకుంటున్నామని భావిస్తున్న తరుణంలో ఈ ఏడాది దాదాపుగా మళ్లీ అదే సమయానికి సెకండ్ వేవ్ మొదలైపోయింది. ఈసారి ఫస్డ్ వేవ్ కంటే దారుణంగా విరుచుకుపడిన ఈ సెకండ్ వేవ్ ప్రభావంతో లక్షలాది మంది బాధితులుగా మారిపోయారు. వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పటికీ సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఆ లోపే ధర్డ్ వేవ్ భయాలు గత నాలుగు నెలలుగా జనాన్ని పట్టి వేధిస్తున్నాయి.

ధర్డ్ వేవ్ హెచ్చరికలు
భారత్ లో ఈ ఏడాది ఏప్రిల్లో సెకండ్ వేవ్ ప్రారంభం అయిన కొంతకాలానికే ధర్డ్ వేవ్ హెచ్చరికలు కూడా మొదలైపోయాయి. ముఖ్యంగా సెకండ్ వేవ్ పెట్టిన భయానికి ధర్డ్ వేవ్ అంటే ప్రజలు తీవ్రంగా బెంబేలెత్తాల్సిన పరిస్దితులు నెలకొన్నాయి. అంతే కాదు ఈ ధర్డ్ వేవ్ ఫస్డ్, సెకండ్ వేవ్ లకు భిన్నంగా పెద్దలపై కంటే పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపబోతోందన్న హెచ్చరికలు తల్లితండ్రుల్ని నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే సెకండ్ వేవ్ తగ్గిందంటూ రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు తెరిసేస్తున్న నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక విద్యార్ధుల తల్లితండ్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అలాగని పిల్లల్ని ఇంట్లో కూర్చుబెట్టలేక, బడులకు పంపలేక వారు నలిగిపోతున్నారు.

దూసుకొస్తున్న ధర్డ్ వేవ్
భారత్ లో ధర్డ్ వేవ్ ఆగస్టులో వస్తుందన్న హెచ్చరికల్ని నిజం చేస్తూ ఈ మహమ్మారి భారత్ లో ప్రవేశించిందని తెలుస్తోంది తాజాగా కేంద్ర హోంశాఖ నియమించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్యానెల్ ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించిన రిపోర్టులో భారత్ లో ఇప్పటికే ధర్డ్ వేవ్ ప్రభావం మొదలైందని వెల్లడించింది. ఏయే రాష్ట్రాల్లో దీని ప్రభావం మొదలైంది, ఏ స్ధాయిలో ఉందన్న విషయాల్ని కూడా హోంశాఖ ప్యానెల్ పీఎంవోకు సమర్పించిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ 19 ధర్డ్ వేవ్ దూసుకొస్తోందని ఈ ప్యానెల్ రిపోర్టులో వెల్లడించింది. దీంతో భారత్ లో ధర్డ్ వేవ్ ప్రభావంపై జనంలో ఆందోళనలు మరింత పెరగబోతున్నాయి.

అక్టోబర్ నాటికి పతాకస్ధాయికి
ప్రస్తుతం భారత్ లో మొదలైన ధర్డ్ వేవ్ ప్రభావం సెప్టెంబర్ నాటికి క్రమంగా పెరుగుతుందని, అక్టోబర్ నాటికి పతాకస్ధాయికి చేరబోతోందని హోంశాఖ నియమించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్యానెల్ హెచ్చరించింది. ఇప్పటికే మొదలైన ధర్డ్ వేవ్ ప్రభావం దేశంలో అక్కడక్కడా కనిపిస్తుండగా.. సెప్టెంబర్ నాటికి ఇది దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ప్యానెల్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అక్టోబర్ నాటికి కచ్చితంగా పీక్ స్టేజ్ కు చేరబోతోందని పీఎంవోకు ఇచ్చిన ప్యానెల్ నివేదిక తెలిపింది.

చిన్నపిల్లలే టార్గెట్
దేశవ్యాప్తంగా దూసుకొస్తున్న కోవిడ్ ధర్డ్ వేవ్ కచ్చితంగా పిల్లలపైనే ప్రభావం చూపబోతోందని కూడా హోంశాఖకు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్యానెల్ ప్రధాని కార్యాలయానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది. గతంలో ఫస్డ్ వేవ్, సెకండ్ వేవ్ ఎలాగైతే పెద్దలపై ప్రభావం చూపిందో అదే స్ధాయిలో ఇప్పుడు ధర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుబోతోందని ప్యానెల్ హెచ్చరించింది. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇంకా మొదలుకాకపోవడంతో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండబోతోందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి పిల్లల్ని కాపాడేందుకు భారీ ఎత్తున చర్యలు చేపట్టాలని సూచించింది. దీంతో పిల్లల టార్గెట్ గానే ధర్డ్ వేవ్ ఉండబోతోందన్న వాదనలకు మరింత బలం చేకూరింది.

ఇప్పటికైనా మేల్కోకపోతే కల్లోలమే
దేశవ్యాప్తంగా ఇప్పటికే కోవిడ్ రెండు వేవ్ ల కారణంగా వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కోట్ల సంఖ్యలో బాధితులుగా మారిపోయారు. దీనంతటికీ ప్రధాన కారణం దేశంలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడమే. నాణ్యతలేని ఆస్పత్రులు, నాసిరకం వైద్యం, ప్రజలకు అందుబాటులో లేని వైద్య సౌకర్యాలు, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఇంకా వ్యాక్సినేషన్ పూర్తి కాకపోవడం.. ఇలా ఎన్నో కారణాలు ప్రజల్ని బాధితులుగా మార్చేశాయి. దీంతో ఇప్పుడు ధర్డ్ వేవ్ ప్రభావం నుంచి పిల్లల్ని కాపాడేందుకు భారీ ఎత్తున వైద్య సౌకర్యాలు తక్షణ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ప్రధాని కార్యాలయానికి ఇచ్చిన రిపోర్టా్ లో హోంశాఖ ప్యానెల్ సూచించింది. భారీ ఎత్తున ఖర్చుపెట్టి తాత్కాలికంగా అయిన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కోరింది. అలా చేయడంలో విఫలమైతే మాత్రం భారీ ఎత్తున ప్రాణనష్టం కూడా తప్పదని హెచ్చరించింది.