ఇప్పటికే కోవాగ్జిన్ రెండు డోసులు-కోవీషీల్డ్ కూడా వేయాలని కోర్టులో పిటిషన్-షాకిచ్చిన కేంద్రం...
ఇప్పటికే రెండు డోసులు కోవాగ్జిన్ వేయించుకున్న ఓ వ్యక్తి.. తనకు రీవ్యాక్సిన్ చేయాలని కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈసారి తనకు కోవీషీల్డ్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నాడు. తాను పనిచేసే సౌదీ అరేబియాలో కోవాగ్జిన్ వేసుకున్నవారిని అనుమతించట్లేదని... కాబట్టి కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేయాలని కోరాడు. దీనిపై స్పందించిన కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఒకసారి రెండో డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యాక మరోసారి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని తెలిపింది.
'కరోనా వ్యాక్సిన్ రెండు డోసులకు మించి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.ఇప్పటికైతే ఒక వ్యక్తికి కేవలం రెండు డోసుల వ్యాక్సిన్కు మాత్రమే అనుమతిస్తున్నాం. వ్యాక్సిన్ మూడో డోసు ఇవ్వాల్సిందిగా ఇంటర్నేషనల్ గైడ్ లెన్స్లోనూ లేదు. వ్యాక్సిన్ ఓవర్ డోస్ అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. దీనిపై ఇప్పటికైతే పరిశోధనలు జరగలేదు. కాబట్టి సదరు పిటిషనర్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేం. ఒకవేళ అతని అభ్యర్థనకు అనుమతిస్తే... ఇలాగే చాలామంది కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది.' అని కేంద్రం పేర్కొంది.

కేరళలోని కన్నూర్కి చెందిన గిరి కుమార్(50) అనే వ్యక్తి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సౌదీ అరేబియాలో తాను పనిచేసే కంపెనీలో ఈ నెల 30లోపు వచ్చి చేరాల్సిందిగా సమాచారమిచ్చారని తెలిపారు. ఒకవేళ ఆలోపు ఉద్యోగంలో చేరకపోతే ఉద్యోగం పోతుందని చెప్పారని పేర్కొన్నారు. తాను కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నానని... అయితే సౌదీ అరేబియాలో ఆ వ్యాక్సిన్ను అనుమతించట్లేదనే విషయం తనకు తెలియదన్నారు. కాబట్టి ఇప్పుడు తనకు కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.లేనిపక్షంలో తన ఉద్యోగం ప్రమాదంలో పడుతుందన్నారు. అయితే కేంద్రం మాత్రం ఇందుకు అనుమతించేది లేదని కోర్టుకు వెల్లడించింది. దీంతో ఇప్పుడు గిరి కుమార్ ఇప్పట్లో సౌదీలో అడుగపెట్టడం కష్టమనే చెప్పాలి.
ఈ ఏడాది జనవరిలో గిరి కుమార్ సౌదీ నుంచి ఇండియా తిరిగొచ్చారు. వ్యాక్సినేషన్ కోసం కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఏప్రిల్ 17న కోవాగ్జిన్ మొదటి డోసు,ఆ తర్వాతి నెలలో రెండో డోసు తీసుకున్నారు. అయితే సౌదీలో కోవాగ్జిన్ను అనుమతించట్లేదనే విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని... ముందే తెలిస్తే కోవాగ్జిన్ తీసుకోకపోయేవాడినని ఆయన వాపోతున్నారు.