తాలిబన్ల రాజ్యం: భారత్ బాటపట్టిన ఆప్ఘనిస్థాన్ చట్టసభ్యులు, తజకిస్థాన్కు అష్రఫ్ ఘనీ
కాబూల్/న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో ఆ దేశ ప్రధాని అష్రఫ్ ఘనీ తజకిస్థాన్ పారిపోయారు. దేశంలో రక్తపాతం జరగకూడదనే తాను ఇలా చేశానని ఆయన తెలిపారు. ఆప్ఘన్ పౌరులు క్షేమం కోసమే తాను దేశం విడిచివ వెళ్లాల్సి వచ్చిందన్నారు. తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో ఆప్ధాన్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.

ఆప్ఘాన్ ప్రధాని పారిపోగా.. భారత్ వైపు ప్రజాప్రతినిధులు
ఇప్పటికే ప్రధాని దేశం విడిచిపోగా, ఇతర చట్టసభ్యులు, ప్రజలు కూడా ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. ఆప్ఘాన్ చట్ట సభ్యులు పలువురు భారతదేశం బాటపట్టారు. ఇప్పటికే కొందరు ఆశ్రయం కోరుతూ భారత్లోకి ప్రవేశించారు. ఆప్ఘాన్ అభివృద్ధిలో ఎంతో కీలకంగా వ్యవహరించిన భారత్ తమకు సురక్షిత ప్రదేశమని ఆ దేశ చట్టసభ్యులు భావిస్తుండటమే ఇందుకు కారణం.

ఆశ్రయం కోరతూ భారత్ చేరుకున్న ఆప్ఘాన్ చట్ట సభ్యులు
ప్రస్తుతం రాజధాని కాబూల్ తోపాటు ఆప్ఘానిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. అన్ని విమానాశ్రయాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం నుంచి ఆప్ఘాన్ చట్టసభ్యులు భారత్ బాటపట్టారు. భారతదేశంలో అడుగుపెట్టిన రాజకీయ ప్రముఖుల్లో వహిదుల్లా కలీమ్జాయ్, వార్దక్ ఎంపీ; అబ్దుల్ అజీజ్ హకీమి, పర్వాన్ నుంచి ఎంపీ; ఎంపీ అబ్దుల్ ఖాదిర్ జజాయ్; సెనేటర్ మాలెం లాలా గుల్; జమీల్ కర్జాయ్, మాజీ ఎంపీ, ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ రెండవ బంధువు; బాగ్లాన్ ఎంపీ శుక్రయా ఎసఖైల్; మహమ్మద్ ఖాన్, సెనేటర్ ఇంజనీర్; అబ్దుల్ హది అర్ఘండివాల్, మాజీ ఆర్థిక మంత్రి; మొహమ్మద్ షరీఫ్ షరీఫీ, మాజీ ఉపాధ్యక్షుడు యూనస్ ఖానూనీ సోదరుడు; ఎంపీ మరియమ్ సోలైమన్ఖైల్; కైస్ మొవాఫాక్, ఆఫ్ఘనిస్తాన్ ఎగువ సభకు సీనియర్ సలహాదారు ఉన్నారు.

భారత్-ఆప్ఘాన్ సంబంధం బలంగానే , కానీ.. తాలిబన్లకు పాక్ సపోర్ట్
ఆఫ్ఘనిస్తాన్-భారతదేశాల ప్రజల మధ్య సంబంధాలు శతాబ్దాలుగా బలంగా ఉన్నాయి. అయితే, పాకిస్థాన్, ఐఎస్ఐ ఆదేశాల మేరకు పనిచేస్తున్న తాలిబాన్లు భారతదేశానికి మాత్రమే కాకుండా మొత్తం భౌగోళిక రాజకీయ స్థిరత్వానికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ సైనికులు, నిఘా సంస్థ ఐఎస్ఐ కూడా తాలిబన్లకు పూర్తి సహకారం అందించింది. ఈ నేపథ్యంలో ఆప్ఘాన్ పౌరులు, ప్రజాప్రతినిధులు ఇరాన్, భారత్ తోపాటు ఇతర పొరుగుదేశాలకు వెళుతున్నారు. ఇరాన్ ఇప్పటికే ఆప్ఘాన్ నుంచి వచ్చేవారి కోసం శరణార్థ శిబిరాలను ఏర్పాటు చేసింది. అల్బేనియా, ఖతార్లు ఆప్ఘాన్ రాజకీయ నేతలకు ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అమెరికాతో చర్చలు జరుపుతున్నాయి. కెనడా కూడా 20వేల మంది ఆప్ఘాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకుంది. ఐక్యరాజ్యసమితి హై కమిషనర్(యూఎన్ హెచ్సీఆర్) గణాంకాల ప్రకారం.. తాలిబన్ల దాడుల నేపథ్యంలో 2021 ప్రారంభంలో 50 వేల మంది ప్రజలు ఇతర దేశాలకు పారిపోయారు. జులై నుంచి ఆగస్టు 9 వరకు 1,26,000 మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని వెల్లడించింది.

ఆప్ఘానిస్థాన్లో తాలిబన్ల రాజ్యం మొదలు
కాగా, కాబూల్ సిటీపై దాడి జరగబోదని, శాంతియుతంగా అధికార మార్పిడికి సిద్ధంగా ఉన్నామని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు. ఆ వెంటనే తాలిబన్ మధ్యవర్తుల బృందం ఒకటి అధ్యక్షభవనంలో చర్చలకు వెళ్లింది. రెండు మూడు గంటల చర్చల అనంతరం.. అఫ్గాన్ అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘని రాజీనామా చేసినట్లు ప్రకటన వెలువడింది. అదే సమయంలో అధికార పగ్గాలను తాలిబన్ నేతలకు అప్పగిస్తున్నట్లూ వెల్లడైంది. శనివారం నాటి ప్రసంగంలో అధ్యక్షుడు ఘని సైనిక సమీకరణపై మాట్లాడటంతో తాలిబన్లు ప్రవేశించే సమయంలో కాబూల్ నగరంలో రక్తపాతం తప్పదనే అంచానలు పెరిగాయి. కానీ అందుకు భిన్నంగా ఆయన ఎలాంటి ప్రతిఘటన లేకుండానే లొంగిపోయారు. ఘని రాజీనామాతో పరిపాలన పగ్గాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీ అయ్యారు. ఈ మేరకు కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ల సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ ను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బరాదర్ బాధ్యతలు చేపట్టడంతో అఫ్గాన్ లో తాలిబన్లకు సంబంధించి నూతన శకం మొదలయినట్లవుతుంది. అష్రఫ్ ఘని రాజీనామాతో పూర్తిగా తాలిబన్ల వశమైపోయిన అఫ్గానిస్థాన్ కు కొత్త అధ్యక్షుడిగా ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ నియమితుడయ్యాడు.
తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా మొహ్మద్ ఒమర్ కు అత్యంత ఆప్తుడిగా పేరుపొందిన బరాదర్.. అధికారికంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు కూడా. ప్రస్తుతం తాలిబన్ల రాజకీయ వ్యూహాలకు ఇంచార్జిగా ఉన్న ఆయన.. అధికార మార్పిడికి సంబంధించి పలు అంతర్జాతీయ వేదికలపై జరిగిన చర్చల్లోనూ ప్రాతినిధ్యం వహించాడు. బంగ్రం జైలు కూడా యూఎస్ బలగాల ఆధీనంలో ఉండేది. కానీ, ఇప్పుడు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అమెరికా బలగాలు ఆఫ్ఘాన్ నుంచి తరలిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు భారీ దాడులతో విరుచుకుపడి ఆప్ఘాన్ మొత్తాన్ని తమ వశం చేసుకున్నారు. బంగ్రం ఎయిర్ బేస్లోని జైల్లో ఉన్న 5000 మంది ఖైదీలను ఇప్పుడు తాలిబన్లు విడిచిపెట్టారు. ఈ ఖైదీలంతా తాలిబన్లకు లొంగిపోయారిన బగ్రం జిల్లా చీఫ్ దర్వాయిష్ రౌఫీ తెలిపారు. కాగా, ఈ ఖైదీల్లో చాలా మంది తాలిబన్లతోపాటు ఇస్టామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. తాలిబన్ల చేతిలోకి ఆఫ్ఘాన్ వెళ్లిన నేపథ్యంలో భారత్ ఆ దేశంలోని అధికారులను, పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది. అమెరికా తమ పౌరులను తిరిగి తీసుకెళ్లేందుకు 6వేల మంది సైనికులను కాబూల్కు పంపింది. ఇక తాలిబన్ల చేతిలోకి వెళ్లిన ఆప్ఘానిస్థాన్ మరో సిరియా మారే అవకాశాలున్నాయని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.