weather update: మరో మూడ్రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది సముద్రమట్టానికి కి 3.1 కి.మీ నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతోందని వెల్లడించింది.
ఒడిశా నుంచి తమిళనాడు వరకూ 1.5 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుకుంది.

కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలోనూ జోరుగా వానలు
తాజాగా, అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బంగాళాఖాతం, దానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఆగస్టు 15వ తేదీ లోపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఆవర్తనం ప్రభావంతో రాబోయే 72 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావం వల్ల ఆగస్టు 17వ తేదీ వరకు ఉత్తర కోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని అధికారులు వెల్లడించారు. ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో దక్షిణం వైపు ఉంది.
ఈ ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం వివరించింది. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.