రఘురామకు వైసీపీ రివర్స్ షాక్ :హోం- సీబీఐ పై ప్రెజర్ -నేరుగా ప్రధానికి..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వ్యవహారం వైసీపీ స్ట్రాటజిక్ గా మూవ్ అవుతోంది. ముల్లు ను ముల్లుతోనే తీయాలని డిసైడ్ అయింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేసారు. ఇప్పుడు దీనికి కౌంటర్ గా వైసీపీ అదే సీబీఐ రఘురామ మీద నమోదు చేసిన కేసుల వ్యవహారాన్ని బయటకు తీసింది. రఘురామ డైరెక్టర్ గా ఉన్న కంపెనీలు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసగించి నట్లుగా మూడు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి.

ఆర్దిక అవకతవకలపై ఫిర్యాదు..
ఆ కేసులో డైరెక్టర్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి పార్టీ ఎంపీల సంతకాలతో కూడిన లేఖలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు పంపారు. తీవ్రమైన ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇండ్-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని, పారిపోకుండా ప్రయాణాలపై నిషేధ ఉత్తర్వులివ్వాలని కోరారు.

సీబీఐ దర్యాప్తు సరిగ్గా లేదంటూ..
రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఇండ్ భారత్ కంపెనీపై సీబీఐ మూడు కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఆ కంపెనీలు దురుద్దేశపూరితంగా బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను మోసగించిన తీరుకు ఈ మూడు ఎఫ్ఐఆర్లు రుజువని లేఖలో వివరించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సక్రమంగా లేదని, దీనివల్ల ప్రజలకు దర్యాప్తు సంస్థలపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్-భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, సంబంధిత కంపెనీలు ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థల నుంచి పెట్టుబడి రూపంలో తెచ్చిన మొత్తాన్ని చూపి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.569.43 కోట్ల మేర రుణాన్ని తీసుకున్నాయని 2016లో పీఎఫ్సీకి సమాచారం అందిందన్నారు.

విదేశాలకు పారిపోకుండా..
2016 మే 4న ఇండ్-భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ తన దురుద్దేశపూరిత చర్యలను అంగీకరించిందని, అప్పుగా తెచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్లను తాకట్టు పెట్టి స్వల్పకాలిక రుణాలు తెచ్చినట్టు ఒప్పుకుందని వివరించారు. ఈ మోసాలపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసిందని, ఎస్బీఐ కూడా ఫిర్యాదు చేసిందని వివరించారు. బ్యాంకు కన్సార్షియాన్ని ఇండ్-భారత్ మోసగించిందని ఫిర్యాదులో పేర్కొందన్నారు. విజయ్ మాల్యా తరహాలో విదేశాలకు పారిపోకుండా డైరెక్టర్లపై ప్రయాణ నిషేధ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధానికి ఆధారాలతో సహా..స్పందిస్తారా
ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం) లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు కె.రఘురామకృష్ణరాజు, మధుసూదన్రెడ్డి, వారి గ్రూప్ కంపెనీలు రూ.941.71 కోట్ల మేర ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు లేఖలో తెలిపారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఢిల్లీ పోలీస్ శాఖ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేసినా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఆ కంపెనీల డైరెక్టర్లు ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తెచ్చారు. మరి..ఇప్పుడు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు పైన ప్రధాని ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.