Telangana
oi-Rajashekhar Garrepally
హైదరాబాద్: జూన్ 5న తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు గురువారంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తాయని, రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

గురు, శుక్రవారాల్లో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు, ఎల్లుండి ఎకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల మూడు రోజుల్లో (జూన్ 10, 11, 12 తేదీల్లో) ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది.
గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించడంతో మరిన్ని వర్షాలు కురుస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు, నిల్వ చేసిన ధాన్యాలు వర్షాలతో తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ధాన్యాలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా ధాన్యాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అధికారులు సరైన విధంగా స్పందించడం లేదని మండిపడుతున్నారు.
నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో మహారాష్ట్రతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు, రైల్వే స్టేషన్లు వరదనీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
English summary
monsoon: heavy rains in Telangana next 3 more days.
Story first published: Thursday, June 10, 2021, 22:23 [IST]