National
oi-Chandrasekhar Rao
ముంబై: మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మరోసారి కలకలం చెలరేగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో మావోయిస్టులకు తీవ్ర నష్టం సంభవించిందనే అంచనాలు ఉన్నాయి. 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తేలింది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలు, పెద్ద ఎత్తున మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొన్ని గంటలుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసుల వైపు నుంచి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదు.
వాహనదారులపై మోత బరువు: మళ్లీ పెట్రో రేట్లు భగ్గు: క్రూడాయిల్ ధర తగ్గినా..
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా కోట్మి పోలీస్ స్టేషన్ పరిధిలోో ఈ తెల్లవారు జామున ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న దండకారణ్యంలో ఎటపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టుల ఉనికిని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీ-60 విభాగం పోలీసులు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. గడ్చిరోలి జిల్లా సరిహద్దుల్లో విస్తరించి ఉన్న దండకారణ్యంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున సమావేశమైనట్లు పక్కా సమాచారం అందడంతో ఈ తెల్లవారు జామున సీ-60 పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు.

ఈ సందర్భంగా ఈ రెండు పక్షాల మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది మావోయిస్టులు మరణించినట్లు తేలింది. ఎటపల్లి సమీపంలోని దట్టమైన అరణ్యప్రాంతం నుంచి వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని గడ్చిరోలి డీఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఎటపల్లి అటవీ ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలను తరలించినట్లు చెప్పారు. పోలీసుల వైపు నుంచి ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం అందలేదని డీఐజీ సందీప్ పాటిల్ పేర్కొన్నారు. పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉందని వివరించారు.
English summary
Bodies of at least six Naxals recovered in the forest area of Etapalli, Gadchiroli in an ongoing encounter between the C-60 unit of Maharashtra Police and Naxals. At least 13 Naxals were neutralized in a police operation in the forest area of Etapalli, Gadchiroli.
Story first published: Friday, May 21, 2021, 10:44 [IST]