వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బరాగావ్ ఖుర్ద్ గ్రామంలో ఆడవాళ్లంతా పొలాల్లోని మెత్తపడ్డ మట్టిని తెచ్చి వాళ్ళ మట్టి ఇళ్లపై అలుకుతున్నారు. ఇది వారి ఇంటిని బలపరచడమేగాక అందంగా కూడా చేస్తుంది.  ఈ పనిని వీరు తరచుగా, ముఖ్యంగా పండుగల ముందు చేస్తారు.

ఇరవైరెండేళ్ల లీలావతి చుట్టుపక్కల ఆడవాళ్ళ లానే  తను కూడా  వెళ్లి మెత్తనైన మట్టిని తెచ్చుకుందామనుకుంది.  కానీ ఆమె మూడు నెలల చంటి బాబు నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఇరవై నాలుగేళ్ల ఆమె భర్త అజయ్ ఓరాన్, దగ్గరలో ఉన్న కీరాణా కొట్టులో పనికి వెళ్ళాడు. ప్రతి కొద్ది నిముషాలకి ఆమె తన ఒళ్ళో పడుకున్న కొడుకు నుదుటిపై చేయి పెట్టి జ్వరం ఏమైనా ఉందేమో అని చూసి “ బానే ఉన్నాడనుకుంటా” అని తనకు తాను సర్ది చెప్పుకుంటోంది.

2018 లో పధ్నాలుగు నెలల  లీలావతి కూతురు జ్వరం తగిలి చనిపోయింది. “అది రెండు రోజుల జ్వరమే, మరి ఎక్కువగా కూడా ఏమి లేదు.” అంది లీలావతి. అంతకు మించి కూతురు ఎలా చనిపోయిందో తలి తండ్రులు ఇద్దరికీ తెలియదు. వారి వద్ద హాస్పిటల్ రికార్డులు, మందుల చీటీలు, వాడిన మందులు - వంటి ఏ వివరాలు  లేవు. జ్వరం ఇంకొన్ని రోజుల్లో తగ్గకపోతే దంపతులిద్దరూ పాప ని తమ గ్రామానికి  తొమ్మిది కిలోమీటర్ల దూరంలో, అధౌరా బ్లాక్ లో కైమూర్ జిల్లాలో ఉన్న PHC కి తీసుకుని వెళదామనుకున్నారు. కానీ తీసుకెళ్లలేకపోయారు.

ఆ PHC కైమూర్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ కి దగ్గరగా, అడవి ప్రాంతంలో ఉంది. దానికి ప్రహరీ గోడ కూడా లేదు. బరాగావ్ ఖుర్ద్, ఆ పక్కనే ఉన్న బారాగావ్ కాలన్ గ్రామాల వారు అక్కడ తిరిగే అడవి జంతువుల గురించి బోల్డన్ని అనుభవాలను చెప్తారు- ఎలుగుబంట్లు, చిరుతపులులు, మనుబోతులు(నీల్ గాయ్)- ఆ భవనంలో తిరిగి (ఈ రెండు ఊర్లకు ఒకటే PHC  ఉంది), పేషెంట్లనూ, బంధువులను భయపెడుతూ, ఆఖరుకి అక్కడ పని చేయడానికి ఇష్టపడని  హెల్త్ కేర్  వర్కర్లని  కూడా జడిపించేవి.

“బరాగావ్ ఖుర్ద్ లో ఒక సబ్ సెంటర్ కూడా ఉంది. కానీ ఆ భవనాన్ని ఎవరూ వాడరు. అది మేకలుకి , వేరే జంతువులకు  విశ్రాంత కుటీరం గా పనికి వస్తుంది.” అన్నది ఫుల్వాసి దేవి అనే ఆశ వర్కర్.  ఈమె 2014 నుంచి తన ఉద్యోగాన్ని ఎలాగోలా  తన సొంత ప్రమాణాలతో లాక్కొస్తోంది.

PHOTO • Vishnu Singh

2018 లో లీలాదేవి, అజయ్ ఓరాగన్(పై వరస) కూతురికి జ్వరం వచ్చి వాళ్లు, కైమూర్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ కి దగ్గరగా ఉన్న PHC కి తీసుకుని  వెళ్లక ముందే, ఆ పాప చనిపోయింది. కానీ ఈ సెంటర్ కూడా పాడయిపోయి ఉంది, ఇక్కడ అంబులెన్సు కూడా ఎన్నో ఏళ్లుగా వాడకుండా  మూల పడి ఉంది. (కింది వరస)

“డాక్టర్లు అధౌరా (పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం)లో ఉంటారు. మొబైల్ కనెక్షన్ లేదు.కాబట్టి ఎమెర్జెన్సీ లో ఎవరిని సంప్రదించలేను,” అన్నది ఫుల్వాసి. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా గాని ఆమె అంచనా ప్రకారం కనీసం 50 మందిని PHC లేదా లేడీ డాక్టర్ లేని పాడయిపోయిన ఉన్న మాతా శిశు ఆసుపత్రి రెఫరల్ యూనిట్ కి(PHC పక్కనే ఉన్న) తీసుకువచ్చాను చెప్తుంది. ఇక్కడ బాధ్యతలు అన్ని ఒక ANM , ఒక మగ డాక్టరు మీద ఉంటాయి. కానీ ఇద్దరూ ఊర్లో ఉండరు, ఫోన్ సిగ్నల్ పనిచెయ్యని కారణంగా ఎమర్జెన్సీ లప్పుడు కబురు చేయడానికి కూడా కుదరదు.

కానీ ఫుల్వాసి తన పనిని తప్పుకోకుండా ధైర్యంగా 85 కుటుంబాలు 522 జనాభా ఉన్న బరాగావ్ ఖుర్ద్ బాధ్యతను తీసుకుంది. ఈ ఊరిలో ఫుల్వాసితో సహా చాలామంది, ఔరాన్ అనే ఒక షెడ్యూల్డ్ తెగ కు చెందిన వారు ఉన్నారు. వారి జీవితమూ, జీతమూ - వ్యవసాయం, అడవి ఈ రెండిటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కొంతమంది సొంత భూమి ఉన్నవారు సాగుచేసి వరి పండిస్తారు. ఇంకొందరు అధౌరా  లేదా వేరే పట్టణాలకు వెళ్లి కూలిపని వెతుక్కుంటారు.

“ఇది చిన్న విషయంలా అనిపిస్తుంది కానీ ప్రభుత్వం యొక్క ఉచిత అంబులెన్స్ ఇక్కడ పని చేయదు.” అని ఫుల్వాసి పాత విరిగిపోయిన వాహనాన్ని చూపిస్తూ అంది. “పైగా మనుషులకు ఆసుపత్రి మీద కొన్ని అపోహలు ఉంటాయి. కాపర్ టీ, గర్భనిరోధక మాత్రలు(   కాపర్ట్ టీ ఎలా శరీరం లోపల పెడతారు,  గర్భనిరోధకమాత్రల వలన నీరసం, తల తిరగడం వస్తుంది) వంటివి అందులో కొన్ని.అన్నిటికన్నా ఎక్కువగా, ఇంట్లో పనంతా చేసుకున్నాక తల్లి- బిడ్డ, పోలియో ఇటువంటి విషయాలు తెలియజేసే ఈ అవగాహన కాంపెయిన్ల గురించి అర్ధం చేసుకునే శ్రద్ధ ఎవరికీ ఉంటుంది?

ఇటువంటి ఆరోగ్య సంరక్షణ అడ్డంకుల  గురించి ఆడవాళ్ళూ, కొత్తగా తల్లులైన వారితో బరాగావ్ ఖుర్ద్ లో  సంభాషణ జరిగింది.మేము మాట్లాడిన వారందరు ఇళ్లలో కాన్పు చేసుకున్నవారే. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే( NFHS - 4 , 2015-16) కైమూర్ జిల్లా డేటా ప్రకారం ఐదేళ్ల నుంచి 80 శాతం కానుపులు  ఆసుపత్రిలో జరుగుతున్నాయి. NFHS  ఇంకోమాట కూడా చెప్తుంది,  ఇంట్లో పుట్టిన పిల్లలెవరూ  24 గంటలల్లోగా ఏ హెల్త్ ఫెసిలిటీ చెకప్ కి  తీసుకురాబడడంలేదని.

బరాగావ్ ఖుర్ద్ లోని ఇంకో ఇంట్లో 21 ఏళ్ళ కాజల్ దేవి, అమ్మగారింట్లో కానుపు జరిగాక 4 నెలల బాబు ని తీసుకుని తన అత్తగారి ఇంటికి తిరిగి వచ్చింది. గర్భవతి గా ఉన్నంత కాలం ఆమె డాక్టర్నిసంప్రదించలేదు. బాబుకి ఇప్పటి దాకా టీకాలు కూడా వేయించలేదు. “ఇంతకాలం నేను మా అమ్మ వాళ్ళింటి దగ్గరున్నా అందుకే ఇక్కడికి వెనక్కి వచ్చాక వేయిద్దామనుకున్నా,” అన్నది కాజల్, తన బాబుకి  108 గడపలు, 619  జనాభా ఉన్న పుట్టింటి ఊరి పక్కనే  బరాగావ్ కలాన్ ఉంది. ఆ ఊరి వారికోసమే ఒక ఆశవర్కర్ ఉంది, అక్కడే టీకా వేయించొచ్చు అని తెలియదు కాజల్ దేవికి. .

PHOTO • Vishnu Singh
PHOTO • Vishnu Singh

‘అప్పుడే పుట్టిన పిల్లల్ని ఆసుపత్రిలో మార్చేస్తారని విన్నాను. ముఖ్యంగా అబ్బాయిలు పుడితే,’ అన్నది కాజల్ దేవి.

డాక్టర్ ని కలవడానికి వెనకాడడం వెనుక బోల్డన్ని భయాలున్నాయి. చాలా సార్లు అది మగపిల్లవాడే  కావాలనుకోవడం వలన కూడా. కాన్పు ఇంట్లో పెద్ద వయసు ఆడవాళ్లతో ఎందుకు చేయించుకోవాలనుకున్నదో అడిగినప్పుడు, “పిల్లలు ఆసుపత్రిలో మారిపోతారని విన్నాను, ఇక అబ్బాయైతే మరీ ప్రమాదమట. అందుకే కాన్పు ఇంట్లో అయితేనే మంచిది.” అని చెప్పింది కాజల్.

బరాగావ్ ఖుర్ద్ లోనే ఉంటున్న ఇరవైఏళ్ళ సునీతాదేవి తాను కూడా ఇంటి లోనే డాక్టర్ గాని ,  శిక్షణ పొందిన నర్స్ కానీ లేకుండానే కానుపు చేసుకున్నానని చెప్పింది.ఆమెకు నాలుగోసారి కూడా ఆడపిల్లే కలిగింది. ఈ మధ్యే పుట్టిన పాప ఆమె ఒళ్ళో పడుకుని  ఉంది. తన అన్ని కాన్పులకు ఒక్కసారి కూడా  డాక్టర్ని  సంప్రదించలేదు.

“ఆసుపత్రిలో చాలామంది ఉంటారు.అంతమంది ముందు పిల్లలని ఎలా  కనేది. నాకు సిగ్గు వేస్తుంది.పైగా ఆడపిల్ల పుడితే ఇంకేముంది!”  అంటుంది సునీత,  ఫుల్వాసి  ఆసుపత్రిలో చాటు ఉంటుందని చెప్పిన  మాటని నమ్మకుండా.

“ఇంటి దగ్గర కానుపు సుఖం- ఒక పెద్దామె సాయం తీసుకోవచ్చు. నాలుగు కానుపులయ్యాక, మనకు పెద్ద సాయం కూడా అవసరం లేదు”.నవ్వేస్తుంది సునీత. “ఆ తర్వాత ఒక అతను వచ్చి  ఒక ఇంజక్షన్ ఇస్తాడు, అది తీసుకుంటే అంతా  బాగయిపోతుంది.”

ఆ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చే మనిషిని  ‘బీనా డిగ్రీ డాక్టరు’ (డిగ్రీ లేని డాక్టరు) అని ఊరిలో కొందరు పిలుస్తారు. ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తలా మార్కెట్ ఉండే ఈయన విద్యార్హత ఏమిటో, అతని ఇచ్చే ఇంజెక్షన్స్  ఏమిటో ఎవరికీ తెలీదు.

సునీత తన ఒళ్ళో పడుకున్న పాప వైపు చూసింది. మా సంభాషణ మధ్యలో ఇంకో పాప పుట్టినందుకు కాస్త న్యూనత పడుతూ తనకు తన భర్తకు ఈ ఆడపిల్లల  పెళ్లిళ్ల గురించే చింత అని,  ఇంటి లో మగమనిషి కి పొలం పని లో  తోడు లేకుండా అయిపొయింది,  అని బెంగ పడింది

PHOTO • Vishnu Singh

పైన ఎడమ: నలుగురు పిల్లల తరవాత, నీకు పెద్ద సహాయం అవసరంలేదు’ అంటుంది సునీతా దేవి. పైన కుడి: ఏడు నెలల గర్భం తో ఉన్న కిరణ్ దేవి ఆసుపత్రికి దూరానికి, ఖర్చుకి భయపడి ఇప్పటికే ఒకసారి కూడా  ఆసుపత్రికి వెళ్ళలేదు. కింద వరస : ఆ ఊరి సబ్ సెంటర్ జంతువులకి నిలయమైంది.

కాన్పు కి 3-4 వారాలు ముందు ఆ తరవాత నాలుగు వారల తరవాత, సునీత ప్రతిరోజూ ఇంటి పని ముగించుకుని  మధ్యాహ్నం పొలం పనికి వెళ్తుంది. ‘అది కొంచెం పని మాత్రమే. నాట్లేయడం లాంటివి, అంతే’, అని చిన్న గొంతుతో అంటుంది.

సునీత వాళ్ళింటికి కాస్త దూరం లోనే 22 ఏళ్ళ కిరణ్ దేవి ఉంటుంది. ఆమెది తొలి చూలు,  ఏడో నెలలో ఉంది. ఈమెని ఒక్కసారి కూడా ఆసుపత్రి కి తీసుకెళ్లలేదు. . ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్ళడానికి చాలా దూరం నడవాలి లేదా ఒక వాహనం అద్దె ఖర్చుకి సిద్ధపడాలి. కిరణ్ అత్తగారు కొన్ని నెలల క్రితమే చనిపోయారు (2020 లో) “మా అత్తగారు వణుకుతూ, ఇక్కడే చనిపోయింది. అయినా మేము ఆసుపత్రి కి ఎలా వెళ్ళగలం?” అని అడిగింది కిరణ్.

బరాగావ్ ఖుర్ద్ లో గాని , బారాగావ్ కాలం లో గాని  ఒకవేళ ఎవరికైనా హఠాత్తుగా ప్రాణాల మీదకు వస్తే, వారికున్న  దారి  ప్రహరీ గోడ కూడా లేని భద్రత కొరవడిన PHC లేదా మాతా శిశు ఆసుపత్రి యొక్క రెఫరల్ యూనిట్(అసలు ఆసుపత్రి 45 కిలోమీటర్ల దూరంలో కైమూర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన బబువా లో ఉంది)

తరచుగా కిరణ్ వాళ్ళ గ్రామం నుంచి ఈ దూరం అంతా నడుచుకుంటూ వస్తారు. ఉన్న కొన్ని బస్సులు రావడానికి సమయమంటూ ఏమి ఉండదు. ప్రైవేట్ వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. మొబైల్ ఫోన్ల మీద సిగ్నల్ కోసం పడే తిప్పలు ఏమి తక్కువ కాదు. ఈ ఊరిలో వారు బయట ప్రపంచం తో సంబంధం లేకుండా కొన్ని వారాలు గడిపేయగలరు.

తన ఉద్యోగం బాగా చేయడానికి తనకి కావలసినదేదో అడిగితే, ఫుల్వాసి తన భర్త  ఫోన్ బయటకు తీసి, “ఇదో పనికిరాని ఆటబొమ్మ”,అన్నది.

“డాక్టరో నర్సో కాదు - బయటి ప్రపంచంతో ఒక చిన్న సంభాషణ, కాస్త సమాచారం  - ఈ ఫోన్ లో వచ్చే ఒక్క సిగ్నల్ గీత ఎన్నో విషయాలను మారుస్తుంది.” అని అంటుంది.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా,  PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్  కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై  దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను   చేస్తున్నారు.  సమాజం లో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను  అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి  అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ?  అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.

అనువాదం: అపర్ణ తోట

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Anubha Bhonsle is a 2015 PARI fellow, an independent journalist, an ICFJ Knight Fellow, and the author of 'Mother, Where’s My Country?', a book about the troubled history of Manipur and the impact of the Armed Forces Special Powers Act.

Other stories by Anubha Bhonsle
Vishnu Singh

Vishnu Singh is an independent journalist based in Patna.

Other stories by Vishnu Singh
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi